Hyderabad Monsoon Alert: Commissioner AV Ranganath Orders Action on Nala Blockages

వర్షాకాలానికి ముందే హెచ్చరిక: నాలాల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశం
హైదరాబాద్, మే 31:
వర్షాకాలం ముందుగానే అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నాలాల ద్వారా వరదనీరు సాఫీగా వెళ్లకపోవడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ శనివారం జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల నాలాల విభాగాల ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
“ఇప్పుడు తేలికపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే… భారీ వర్షాలు కురిస్తే ప్రజలు ఎంత తలనొప్పులు పడతారో ఊహించుకోవచ్చు. ఇది తలెత్తే ముందే చర్యలు తీసుకుందాం,” అంటూ అధికారులతో చర్చించారు.
“సమస్య ఉంటే వెంటనే తెలపండి”
కమిషనర్ స్పష్టంగా తెలిపారు – నాలాల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకోవాలి. “ఎక్కడైనా సమస్య ఉంటే, వెంటనే మాకు తెలియజేయండి. నివాసాల ఆక్రమణలు ఉంటే పరిష్కార మార్గాలు చూస్తాం. అనధికార కట్టడాలపై ఖచ్చితంగా తొలగింపు చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
ప్రతి ప్రాంతంలోని నాలాల పరిస్థితులను గుర్తించాలన్న ఆయన, అధికారులందరూ స్పష్టమైన అవగాహనతో పనిచేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణతోపాటు నాలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ఆక్రమణల నివారణపై హైడ్రా స్పష్టంగా దృష్టి సారించిందని తెలిపారు.
కల్వర్ట్ల వద్ద చెత్త: వరదలకు కారణం
కల్వర్ట్ల వద్ద పేరుకుపోతున్న చెత్త వల్ల వరద ముప్పు పెరుగుతోందని కమిషనర్ వెల్లడించారు. మలక్పేట ప్రాంతంలో మాన్హోల్స్ నుంచి వరద నీరు పొంగిపొర్లడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు.
చెత్తను పర్యవేక్షించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. నాలాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని ఏ మాత్రం సహించబోమన్నారు. “ఎవరైనా చెత్త వేస్తే, సమాచారం ఇస్తే వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి విచారణ చేస్తాం” అని చెప్పారు.
ఈ ఏడాది నగరానికి వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ సూచించారు.