
Image: Screenshot from ‘ : https://www.abplive.com/ ” (used under fair use for reporting)
విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు.. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లను పెట్టనున్నారు. Visakhapatnam stadium : భారత మహిళా క్రికెటర్లను గుర్తించాలని స్మృతి మంధాన చేసిన హృదయపూర్వక సూచన వాస్తవ రూపం దాల్చనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. 2025 అక్టోబర్ 12న స్టాండ్లకు మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టనున్నారు. ఆ రోజు మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వైజాగ్ స్టేడియంలో(Visakhapatnam stadium) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు స్టాండ్లకు పేర్లు పెట్టనున్నారు. ఆగస్టు 2025లో బ్రేకింగ్ బౌండరీస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్తో పాటు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పాల్గొన్నారు. ఈ సందర్భంలో.. విశాఖపట్నంతో పాటు వివిధ వేదికల్లో పురుషుల దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టాండ్స్ ఉన్నాయని, భారత మహిళా దిగ్గజ క్రికెటర్లతో పేర్లతో స్టాండ్స్ లేవనే విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి స్మృతి మంధాన తీసుకువచ్చారు. స్టాండ్లకు మహిళా క్రికెటర్ల పేర్లను పెట్టడం వల్ల వారు క్రికెట్ కు చేసిన కృషిని గౌరవించినట్లు అవుతుందని, అదే సమయంలో యువ మహిళా ప్లేయర్లకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. మంధాన విజ్ఞప్తి పై మంత్రి లోకేష్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను సంప్రదించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు ఆంధ్రలో జన్మించి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రవి కల్పనల పేర్లను పెట్టాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీర్మానించింది. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీరాజ్ అరంగ్రేటం చేసింది. 2022లో ఆటకు వీడ్కోలు పలికింది. తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో టీమ్ఇండియా తరుపున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టుల్లో 43.7 సగటుతో 699 పరుగులు చేశారు. ఇందులో ఓ శతకం నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 50.7 సగటుతో 7805 పరుగులు చేశాడు. ఇందులో ఏడు శతకాలు 64 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో 37.5 సగటుతో 2364 పరుగులు సాధించింది. ఇందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మిథాలీ రాజ్ రికార్డులకు ఎక్కింది. ఇక రవి కల్పన విషయానికి వస్తే.. టీమ్ఇండియా తరుపున 7 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించింది.