
చెత్త తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దిక్కుమాలిన స్థితికి
రాష్ట్రాన్ని దిగజార్చావు
హరీశ్రావు ఫైర్
హైదరాబాద్
అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యిందని, మీరు చెప్పిన మార్పు ఇదేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల్లో చెత్తను తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దికుమాలిన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చావని ధ్వజమెత్తారు. పెట్రోల్ పంపుల్లో డీజిల్ను ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చావని విమర్శించారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ గ్రామ పంచాయతీలను దేశం గర్వించే దిశగా తీర్చిదిద్దితే, ఇప్పుడు రేవంత్రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతున్నాయని విమర్శించారు. పంచాయతీల సంఖ్యను 12,941కి చేర్చి, ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం నిధుల్లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటు పడిందని, నెలనెలా నిధుల్లేక నిర్వహణను గాలికొదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పాలనలో మహర్దశ:
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వానాకాలం ప్రారంభంలోనే ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించేదని హరీశ్రావు గుర్తుచేశారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పంచాయతీలకు నెలనెలా రూ.275 కోట్ల నిధులను పంచాయతీలకు విడుదల చేశామని, మొత్తంగా ఏటా రూ.3,330 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. పట్టణాల పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా అదనంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
అంధకారంలో గ్రామాలు:
కాలిపోయిన వీధి దీపాలు మార్చడానికి నిధుల్లేక అనేక గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చెయ్యలేక, ఆ ఆర్థిక భా రాన్ని మోయలేక పంచాయతీ కార్యార్శు లు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ సర్కారు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలల జీతాలు అందక నిరసన వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శించారు. పాలన గాలికొదిలేసి ముగ్గురు మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించేందుకు మూడురోజులుగా ఢిల్లీలో తిష్ఠవేశారని సీఎం, మంత్రులకు చురకలంటించారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు.