
హైదరాబాద్, గాంధీభవన్:
తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఠక్కున సవాల్ విసిరారు. హరీష్ రావుతో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. “కంచె చేను మేసినట్లుగా ప్రభుత్వ ఆస్తులను దారి మళ్లించారు,” అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా గౌడ్ విమర్శలు గుప్పించారు. “రూ.1.20 లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి నీరు లేకుండా చేసారు. కాళేశ్వరం కాస్త కులేశ్వరం అయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి,” అన్నారు.
ఈటల–హరీష్ భేటీపై తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. “హరీష్ రావు ఏ పార్టీలో పోటీ చేయాలనుకుంటున్నారు? నాలుగు ముక్కలాటలో ఆఖరికి బీఆర్ఎస్కే చేరతారా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్–బీజేపీ పొత్తుపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందు, హరీష్ రావు స్పందన ఇవ్వాలని డిమాండ్ చేశారు.