
కక్షలు మానండి …
ఆత్మీయంగా జీవిద్దాం.
. మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం…
సిఐ మోహన్ పిలుపు
బ్రహ్మంగారిమఠం
ఆత్మీయంగా జీవిద్దాం మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేద్దాం అని ఖాజీపేట సి.ఐ మోహన్ పేర్కొన్నారు. ఖాజీపేట మండలంలోని ముత్తులూరు పాడు గ్రామం లో జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఫ్యాక్షన్ కక్షల వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళాజాత బృందం హెడ్ కానిస్టేబుల్ నరసరామయ్య బృందం ఆధ్వర్యంలో ‘మేలుకొలుపు’ నాటక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం వారిచే గ్రామం లోని ప్రజలకు నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా మేలుకొలుపు కార్యక్రమంలో నాటక ప్రదర్శనతో వారి జీవితాల్లో మార్పు కోసం అవగాహన కల్పిస్తున్నామన్నారు. కక్షలు మానాలని, కత్తులు వీడాలని సి.ఐ సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండాలని సూచించారు.
పోక్సో యాక్టు, పిల్లల భద్రత, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, డయల్ – 112, రహదారి భద్రత, సోషల్ మీడియా & సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సి.ఐ మోహన్ తెలియజేశారు. కళాజాత బృందం ప్రదర్శించిన నాటకం గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.