
ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి
రైతులకు విత్తనాల పంపిణీ, డ్రోన్ ప్రారంభం..
రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
సాంకేతికత జోడిస్తే వ్యవసాయ పనులు సులభం
– హోం మంత్రి అనిత
యస్ రాయవరం,
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.యస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ 80 శాతం రాయితీపై డ్రోన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, రైతులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా పరికరాలు అందించడమే లక్ష్యమన్నారు. డ్రోన్ల సాయంతో ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులను సులభతరం చేసుకుంటున్నారని చెప్పారు.
రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతు దేశానికి వెన్నెముకలాంటివారని అభిప్రాయపడ్డారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.