ఉత్తరాంధ్రపై కేసీఆర్‌ నజర్‌



బీఆర్‌ఎస్‌ విస్తరణపై సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఏపీపై కేసీఆర్‌ నజర్‌ వేశారు. ఇప్పటికే ఏపీలో బీఆర్‌ఎస్‌ను విస్తరించిన కేసీఆర్‌.. పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. ఇప్పుడు ఏపీలోని ఉత్తరాంధ్రపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది.ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు తోట చంద్రశేఖర్‌ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనుంది. ఈ సమ్మేళనాల్లో చంద్రశేఖర్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని చెబుతున్నారు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ నిర్వహించనుంది.ఆర్కే బీచ్‌ నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొననున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రశేఖర్‌.. అక్కడ నుంచి సిరిపురం పుడా పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. వరుస కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ప్రధాన కూడళ్లలో బీఆర్‌ఎస్‌ జెండాలు వెలిశాయి.ఉత్తరాంధ్ర నేతలు, కార్యకర్తలతో తోట చంద్రశేఖర్‌ సమావేశం కానున్నారు. అలాగే సోమవారం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ముందుగా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలుమార్లు కేసీఆర్‌ వ్యతిరేకించారు. పలు బహిరంగ సభల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వపరం చేస్తామని హావిూ ఇచ్చారు.అలాగే ఇటీవల మంత్రి కేటీఆర్‌ కూడా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్‌ చెప్పారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *