
అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
పోలీసులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ పార్టీ నేతలు చంపేస్తాం, నరికేస్తాం అంటూ బహిరంగంగానే విధ్వంసం సృష్టించడంపై.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అనుమతులు లేకుండా డీజేలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు నిబంధనలు తుంగలో తొక్కి ఇరువురు వ్యక్తుల మరణానికి కారణమైనందుకు ఇప్పటికే పోలీసులు చర్యలకు దిగారు. అల్లర్లకు కారణమైన వారిపై వరసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి పవన్ పోలీసులకు ఆదేశమిచ్చారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని సూచించారు.జగన్ ఓదార్పు పర్యటనలో వైసీపీ నేతలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. 2029లో తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరికేస్తామంటూ పుష్ప డైలాగులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ ఘాటుగా స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి..వాటిని ఆచరణలో పెడతాము. ఆ డైలాగులకు అనుగుణంగా మేం ప్రవర్తిస్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు.ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఎవరైనా చట్ట ప్రకారం నియమనిబంధనలను పాటించేలా చూడాలని సూచించింది. ఈ క్రమంలోనే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదని.. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని అన్నారు. అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారిని ఓ కంట కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా.. వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను చేసేవారిని ప్రజలంతా గమనించాలి కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోకూడదని పేర్కొన్నారు.